ఏబీ వెంకటేశ్వరరావు భద్రత ఉపసంహరణ
అమరావతి: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ హోదాలో పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన భద్రతను ఉపసంహరించింది. ఆయనకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న బుల్లెట్ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలు, గన్మెన్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
అయితే మాజీ డీజీపీలు ద్వారకా తిరుమలరావు, సాంబశివరావు, సురేంద్రబాబులకు బుల్లెట్ప్రూఫ్ వాహనాల సౌకర్యం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన లేదా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన సీనియర్ పోలీసు అధికారులకు పదవీ విరమణ తర్వాత కూడా ముప్పు అంచనా (Threat Perception) ఆధారంగా భద్రత కొనసాగించడం ఆనవాయితీ. ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్, యాంటీ-నక్సల్ ఆపరేషన్లలో పనిచేసిన పలువురు మాజీ డీజీపీలకు సంవత్సరాలుగా భద్రత కొనసాగుతోంది. భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షించినప్పటికీ, ముప్పు పూర్తిగా తగ్గిందని భావించినప్పుడు మాత్రమే దానిలో మార్పులు చేస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావుకు భద్రత ఉపసంహరణ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొద్ది నెలలుగా ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోని పలు విధాన నిర్ణయాలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ, పరిపాలన, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై సామాజిక మాధ్యమాలు, బహిరంగ వేదికల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఏబీ వెంకటేశ్వరరావు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ఆ కారణంగా ఆయనను టీడీపీకి అనుకూల అధికారిగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు విమర్శించేవి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ను సస్పెండ్ చేయడం, పలు ఆరోపణలపై విచారణలు జరపడం, సుదీర్ఘకాలం విధులకు దూరంగా ఉంచడం జరిగింది. ఆ చర్యలను ఏబీ వెంకటేశ్వరరావు న్యాయస్థానాల్లో సవాలు చేయగా, అనంతరం కోర్టు ఆదేశాలతో తిరిగి సేవలో చేరి పదవీ విరమణ చేశారు.
ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలోనే ఆయనకు భద్రత ఉపసంహరించబడటం విశేషంగా మారింది. అయితే ఈ నిర్ణయం పూర్తిగా భద్రతా ముప్పు అంచనా ఆధారంగానే తీసుకున్నదా, లేక మరే ఇతర కారణాలున్నాయా అనే అంశంపై ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు, ఈ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Login
Comments (1)
1 days agoఈ చర్య ఆశ్చర్యం కలిగించింది. రాజకీయ ప్రత్యర్థుల పట్ల చంద్రబాబు నాయుడు చాలా ఔదార్యం తో వ్యవహరించడం చూస్తున్నాం. 2019-24 మధ్య సమాజం పై దండయాత్ర చేసిన క్లెప్టోక్రసీ ముఠాల పట్ల కూడా ఆయన గొప్ప ఔదార్యం ప్రదర్శిస్తున్నారు. అటువంటిది - ప్రభుత్వం పై అంశాల వారీగా తన నిరసన గళం వినిపిస్తున్న ఏ బీ వెంకటేశ్వర రావు కు గల భద్రత ను ఉపసంహరించడం... చంద్రబాబు ఇమేజ్ ను జనం దృష్టిలో పలుచన చేసే అవకాశం లేకపోలేదు. నిజానికి ఏబీ వెంకటేశ్వర రావు కు భద్రతా పరమైన ఇబ్బంది ఏమీ ఉన్నట్టు లేకపోయినా ; జనం లో ఆయన పట్ల సానుభూతి బాగా పెరగడానికే ఈ చర్య ఉపకరిస్తుందనే చిన్న లాజిక్ ఈ నిర్ణయం తీసుకున్న వారిలో ఎలా మిస్ అయిందో అర్ధం కావడం లేదు. ఏబీ వెంకటేశ్వర రావు ను చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారనే సాంకేతాలు జనం లోకి వెళ్లడం లేదా?