ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో జోక్యం, అత్యాచారం సెక్షన్ల చేర్పు, కస్టడీ వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కోరుతూ డీజీపీకి లేఖ
హైదరాబాద్: ఐపీఎస్ ప్రొబేషనర్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తులో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పాత్రపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్కు విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా కేసు దర్యాప్తులో వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు, అనంతరం అత్యాచారం, హత్యాయత్నం సెక్షన్లు చేర్చడం, కస్టడీలో దుర్వ్యవహారం, ఉదయ్ కృష్ణారెడ్డిని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారనే ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరపాలని కోరారు.
ఆగస్టు 8 తేదీతో డీజీపీకి పంపిన లేఖలో నాగేశ్వరరావు, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తును సీబీ-సీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని కోరారు.
"అసాధారణ వేగంతో అరెస్టు"
పోష్ (POSH) చట్టం కింద అంతర్గత విచారణ పూర్తికాకముందే పోలీసులు అసాధారణ వేగంతో ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారని లేఖలో పేర్కొన్నారు. అరెస్టుకు అవసరమైన చట్టపరమైన ప్రమాణాలు పాటించారా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు.
రేప్, హత్యాయత్నం సెక్షన్లపై ప్రశ్నలు
ప్రాథమిక ఫిర్యాదుల్లో అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు లేవని, అయితే రిమాండ్ రిపోర్టులో ఈ సెక్షన్లు చేర్చారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ఎప్పుడు, ఏ ఆధారాలతో చేర్చారో స్వతంత్రంగా విచారించాలని డిమాండ్ చేశారు.
కస్టడీ వేధింపుల ఆరోపణలు
ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ ఎదుట కస్టడీలో అమానుషంగా ప్రవర్తించారని, సీసీటీవీ లేని ప్రాంతాల్లో విచారించారని ఫిర్యాదు చేసినట్లు మీడియా కథనాలను లేఖలో ప్రస్తావించారు. కమిషనర్ సజ్జనార్ స్వయంగా విచారణలో పాల్గొని ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారనే ఆరోపణలు నిజమైతే అవి అత్యంత తీవ్రమైనవని, స్వతంత్ర విచారణ అవసరమని పేర్కొన్నారు.
సజ్జనార్ పాత్రపై ప్రశ్నలు
మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు తన లేఖలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ కేసుకు ప్రత్యక్ష పర్యవేక్షణాధికారి కాకపోయినా, దర్యాప్తుపై ఆయన అసాధారణ వ్యక్తిగత ఆసక్తి చూపారని, ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించారని, అనంతరం అత్యాచారం, హత్యాయత్నం సెక్షన్లు చేర్చిన తీరు, కస్టడీలో దుర్వ్యవహారం, ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారనే ఆరోపణలపై స్వతంత్ర శాఖాపరమైన విచారణ జరపాలని కోరారు.
అలాగే ఫిర్యాదుదారు ఐపీఎస్ ప్రొబేషనర్ కర్ణాటకకు చెందినవారు కావడం, సజ్జనార్ స్వస్థలం కూడా అదే రాష్ట్రం కావడంతో వ్యక్తిగత, వృత్తిపరమైన లేదా ఇతర సంబంధాలు ఏమైనా ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేశాయా అనే కోణంలోనూ విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
ఐదు ప్రధాన విజ్ఞప్తులు
డీజీపీకి పంపిన లేఖలో నాగేశ్వరరావు ఐదు కీలక డిమాండ్లు చేశారు. కేసును స్వతంత్ర సంస్థకు బదిలీ చేయడం, కస్టడీ వేధింపులపై విచారణ, సీసీటీవీ ఫుటేజ్ సహా అన్ని ఆధారాలను భద్రపరచడం, సజ్జనార్పై శాఖాపరమైన విచారణ జరపడం, ఫిర్యాదుదారు లేదా నిందితుడిపై పక్షపాతం లేకుండా చట్టప్రకారం దర్యాప్తు జరిగేలా చూడాలని కోరారు.
Don’t receive OTP? Resend